Monday, November 17, 2014

పెరుగుతున్న విద్యుత్‌ కొరత - ఉత్పత్తి రంగానికి నష్టదాయకం.


ప్రచుణార్థం / ప్రసారార్థం :

తేది : 22.10.2014



             రాష్ట్రంలో విద్యుత్‌ కొరత దినదినం పెరుగుతూనే ఉన్నది. రోజుకు 165 మి.యూనిట్లు అవసరం కాగా, 140 మి.యూనిట్లు మాత్రమే లభ్యత ఉన్నది. రోజు కొరత 25 మి. యూనిట్లకు పెరిగింది. గతంలో ఉన్న విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తిని నిలుపుదల చేస్తున్నారు. తక్షణమే విద్యుత్‌ కొరతను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సిపిఐ(యం) తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.
             గత రెండు రోజుల క్రింతం శ్రీశైలం కుడికాలువ విద్యుత్‌ 770 మె.వాట్లు ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్పత్తి నిలుపుదల చేసింది. పైగా ఎడమవైపు (తెలంగాణ) గల 900 మె.వాట్ల విద్యుత్‌ను నిలుపుదల చేయమని
కృష్ణా నదీజలాల బోర్డు ద్వారా కోరింది. గతంలోనే స్థాపిత శక్తిలో గ్యాస్‌ కొరత వల్ల 3000 మె.వాట్లు, బగ్గు దిగుమతి కొరత వల్ల 1500 మె.వాట్లు విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. వాస్తవానికి ఉభయ రాష్ట్రాల్లో గల స్థాపిత విద్యుత్‌ శక్తి 70 శాతం ఉత్పత్తి చేసినా కొరత ఉండదు. గత ఐదు సంవత్సరాల సగటును ఉత్పత్తి చేసి తెలంగాణకు 51.12 శాతం, ఆంధ్రకు 48.88శాతం వినియోగించుకోవాలని రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టం చేసారు. ఐనా, ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను అర్ధంతరంగా మూసివేయడం ద్వారా కొరత తీవ్రతరం అయ్యింది. తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుండి విద్యుత్‌ను కొనుగోలు చేసి సమస్యను పరిష్కరిస్తామని పదేపదే చెబుతున్నది. కాని ఆచరణలో అలాంటి ప్రయత్నమేదీ జరగలేదు. కనీసం ప్రత్యామ్నాయ వనరుల పరిశీలన కూడా లేదు.
             విద్యుత్‌ కొరత వల్ల పంప్‌సెట్ల క్రింద పంటలు ఎండిపోతున్నాయి. వందల ఎకరాల్లో ఎండిపోయిన వరిపంటను రైతులు తగులబెట్టి నిరసన తెలుపుతున్నారు. పంటలు నష్టపోవడం వలన ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం ఆ వైపు దృష్టి పెట్టడం లేదు. పరిశ్రమలకు రెండు రోజుల ఫవర్‌హాలిడే ఉండగా, ప్రస్తుతం ఒకరోజు కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలోగల పరిశ్రమలు మూతపడడం వల్ల కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. వ్యవసాయరంగం, పారిశ్రామికరంగంలో విద్యుత్‌ కొరత ఉత్పత్తిరంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. అనేక గ్రామాల్లో కరెంటు కోత వలన త్రాగునీటి పథకాలు పనిచేయడం లేదు.
             తక్షణమే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి విద్యుత్‌ కొరత పరిష్కారానికి కృషి చేయాలి. ఉత్పత్తి రంగాన్ని మరింత దిగజారకుండా చూడాలి.



No comments:

Post a Comment